*
Thank you for reading this post, don't forget to subscribe!— తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న కళలను నెరవేర్చే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి*
— సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో డిటిసి లో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ శిక్షణ శిబిరం లో ఆదిలాబాద్,మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన యువకులకు ఉచితంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన శారీరక మరియు బోధన తరగతులకు సంబంధించిన విభాగాలలో శిక్షణ అందించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరంగా కఠోర శ్రమతో చదవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి రోజు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, సొంతంగా నోట్స్ తయారుచేసుకుని కష్టపడి చదివిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాలలో ఏదైనా ఒక ఉద్యోగం కచ్చితంగా సాధించవచ్చని విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందించే విధంగా సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు కావాల్సిన సిలబస్ ను పూర్తిగా చదివి, ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధ్యాపకులను అడిగి వెంటనే నివృత్తి చేసుకుని క్రమశిక్షణతో, శ్రద్ధతో చెప్పిన పాఠ్యాంశాలను నెమరువేస్తూ శిక్షణను పూర్తి చేయాలని సూచించారు. రానున్న అన్ని ఉద్యోగాలకు దాదాపుగా ఒకే రకమైన పోటీ పరీక్షలు నిర్వహించబడతాయి కావున ఒక ఉద్యోగం రాకపోయిన అంతమాత్రాన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉద్యోగం వచ్చేంతవరకు కష్టపడి చదివినవారికి తప్పకుండా ఉన్నత స్థానాల కు ఎదగవచ్చని తెలిపారు. తల్లిదండ్రులకు తమ పై ఎన్నో ఆశలు కళలు ఉంటాయని వాటిని నెరవేర్చడం మరియు సమాజంలో తనకంటూ ఒక గౌరవం ఏర్పాటు చేసుకోవడం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు వీటిని సాధించడమే ప్రస్తుతం మీ ముందున్న ప్రధాన లక్ష్యంగా కొనసాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి బి సునీత, అడిషనల్ ఎస్పీ సి సమయ్ జాన్ రావు, సీఐ పి గంగాధర్, ఆర్ఐ గడిగొప్పుల వేణు, డి టి సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments