రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 4న జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆదిలాబాద్ : ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. స్టేజ్ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు. ఏరోడ్రోమ్ లో హెలిపాడ్, పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, అలాగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న ప్రజా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, మార్గాల గుర్తింపు వంటి అంశాలపై విభాగాలకు దిశానిర్దేశం చేశారు. సిఎం పబ్లిక్ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, ఏఎస్పీ మౌనిక, వివిధ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.