రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాదు :
ప్రజా పాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలు, నూతన రేషన్ కార్డులు, పెన్షన్ ల కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు సంఖ్య, కులం, పుట్టిన తేదీ ఆధార్కార్డు, రేషన్కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా ఇతర వివరాలతో కూడిన ఆన్లైన్ ఫారంను ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తుఫారములో ఉన్న ప్రకారంగానే నమోదు చేసే విధంగా టాటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈనెల 6వ తేదీ నుండి అధికారుల పర్యవేక్షణలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రారంభించడం నిర్వహించడం జరుగుతుందని, ఈనెల 17వ తేదీలోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని రైస్ మిల్లర్లకు నిర్దేశించిన సి ఎం ఆర్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్త, శ్యామలాదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధారాణి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments