epaper
Friday, January 16, 2026

‘నన్ను చంపేస్తానంటున్నారు’..

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Viveka) హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్ సునీత (YS Sunitha) చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ సునీత తిరుగుతున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ సునీత వెనక్కి తగ్గలేదు. ఇటీవల తన సోదరి వైఎస్ షర్మిలను సునీత కలవడం, ఆమెతో పాటు ఇడుపులపాయకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ”చంపేస్తామంటూ” సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులతో పాటు తనను, వైఎస్ షర్మిలను ”లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులోని పలు అంశాలు ఇవే..

”నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో నా పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. వర్రా రవీంద్ర రెడ్డి పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడు. వర్రా రవీంద్ర రెడ్డి పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి. జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీందర్ రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్ పెట్టాడు. ”అందుకే పెద్దలు అన్నారు శత్రు శేషం ఉండకూడదు లేపేయ్ అన్నాయ్ ఇద్దరినీ ఈ ఎన్నికలకు పనికి వస్తారు” అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. నా స్నేహితులు నాకు ఫేస్‌బుక్ లింక్ పంపారు. రవీందర్ రెడ్డి ఫేస్‌బుక్‌ పోస్టులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నా తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా ఫిర్యాదు చేశాను. రవీందర్ రెడ్డి ఫేస్‌బుక్ పేజీలో మొత్తం నన్ను షర్మిలను, వైఎస్ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయి. చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేలా పోస్టులు పెట్టే వారిపై తగిన చర్యలు తీసుకోండి” అంటూ వైఎస్ సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాకు ఫిర్యాదు వచ్చింది: సైబర్ క్రైమ్ డీసీపీ

డాక్టర్ వైఎస్ సునీత సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు ఫేస్‌బుక్‌లో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారన్నారు. పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారని.. లేపేస్తాం అని అర్థం వచ్చే విధంగా పోస్టులు ఉన్నాయని సునీత ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని చర్యలు తీసుకోవాల్సిందిగా సునీత కోరినట్లు శిల్పవల్లి వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!