జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు మరియు మొదటి అదనపు జడ్జ్ మాధవి కృష్ణ, రెండవ అదనపు జడ్జి సతీష్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
- నూతన సాంకేతికత వినియోగంతో మరింత స్పష్టంగా కేసుల పరిశోధన.
- కొత్త ఆలోచనలు పకడ్బందీ ప్రణాళికతో శాంతి భద్రతల పరిరక్షణ…..
- ప్రమాదాల నివారణకు, మట్కా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణ అమలు ……..
- ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా సీసీటీవీ నిఘాలో వచ్చే విధంగా కృషి
— జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయం నందు జిల్లా పోలీసులు, జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు పుస్తకాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా మొదటి అదనపు జడ్జి మాధవి కృష్ణ, రెండవ అదనపు జడ్జి సతీష్ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో మొదటి రోజు జిల్లా ఎస్పీ కి శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున అతిధులు రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా చూస్తూ, పోలీసులు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా ప్రమాదాల నివారణకు, మట్కా నిర్మూలనకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యచరణను అవలంబించబోతుందని తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాలను నివారించాలని తెలియజేశారు. అదిలాబాద్ జిల్లా పూర్తిగా సీసీటీవీ నిఘా లో వచ్చే విధంగా ప్రతి మండల పోలీస్ స్టేషన్ నుండి సీసీటీవీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు.

జిల్లాలో నేరాలను కట్టడం చేయడానికి పోలీసులు మరింత శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోనటువంటి ప్రజలకు మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం అందజేసినట్టు తెలియజేశారు. ఆదివాసి గ్రామాల్లో కోలాం గిరిజనులకు దాదాపు 1000 దుప్పట్లు పంపిణీ చేసి గిరిజనులకు పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎటువంటి ఆపత్కాల సమయంలోనైనా త్వరితగతిన డయల్ 100 ను ప్రజలు విరివిగా వినియోగించి పోలీసు సేవలను పొందాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మరింత గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగరితంగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని అప్పుడే బాధితులకు పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డిఎస్పీ వి ఉమేందర్, సీసీ దుర్గం శ్రీనివాస్, సిఐలు కే పురుషోత్తం, కే సత్యనారాయణ, బి రఘుపతి, ఎం నైలు, జై కృష్ణమూర్తి, ఈ చంద్రమౌళి, ప్రేమ్ కుమార్, ఐ సైదారావు, పి గంగాధర్, కే మల్లేష్, జి మల్లేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు, రిజర్వు సిబ్బంది,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments