ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగ మొయిజ్పై పోలీసులు పీడీ యాక్ట్ (Preventive Detention Act) నమోదు చేశారు. నిందితుడు గత దాదాపు 15 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ, ఇప్పటివరకు సుమారు 70 దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, మొయిజ్పై 2019లో కూడా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కాగా, సంవత్సరం పాటు జైలులో ఉన్నాడు. విడుదల అనంతరం ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ప్రజల భద్రత దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ నిందితుడిపై మళ్లీ పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
పునరావృతంగా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కె. నాగరాజు కోరారు.


Recent Comments