అదిలాబాద్ జిల్లాలో దొంగతనం కేసు ఛేదన – పనిమనిషి అరెస్ట్, 100% సొత్తు రికవరీ
అదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 1: ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ తన కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి, దొంగిలించిన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు.
Thank you for reading this post, don't forget to subscribe!

ఇచ్చోడ టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవర్ ప్రేమ్ సింగ్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. గత నెల 16న శుభకార్యానికి వెళ్లిన ఆయన ఇంట్లో బంగారం, వెండి భద్రపరిచి వెళ్లారు. ఈ పరిస్థితిని గమనించిన పనిమనిషి దేవల లక్ష్మి (35), తన కూతురితో కలిసి ముందుగా కుట్ర పన్ని, ఇంటి వెనుక గది తలుపును గడియ పెట్టకుండా ఉంచింది.
ఇంటి యజమానులు లేని సమయంలో, ఈ నెల 18న పది తులాల బంగారం, పది తులాల వెండిని అపహరించారు. ఘటన వెంటనే బయటపడకపోవడంతో ఆలస్యంగా తెలిసింది. ఈ నెల 26న మరో శుభకార్యానికి వెళ్లే సందర్భంలో నగలు కనిపించకపోవడంతో బాధితులు 27న ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇచ్చోడలోనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి పది తులాల బంగారం, పది తులాల వెండి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి అత్యాశతో ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని ఆయన వివరించారు. నేరాల నియంత్రణ, విచారణలో సీసీటీవీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన ఇచ్చోడ ఎస్హెచ్ఓ బండారి రాజు, ఎస్ఐ రమేష్, సిబ్బంది రుక్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించారు.