republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 January 2024, 11:50 am Digital Edition : REPUBLIC HINDUSTAN

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు

హైదరాబాద్: జనవరి 25
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.

అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ (నెం. 45/2024)తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది.

ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కిచెప్పింది. కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో (నెం. 12425) లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది.

ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు రూ. 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం రూ. 1100 కోట్ల మేర ఉంటుందని, అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి దాకలు చేసిన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వెంకట్రా మిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను గురువారం విచారించి పై ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరగ్గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్‌ఏకు లేఖ రాశానని మే 16న కోర్టుకు వివరించారు.

సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ లాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీకి లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ఈ లావాదేవీలకు కొనసాగిం పుగా హెచ్ఎండీఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.

తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషనర్ తరఫునా, బీఆర్ఎస్ తరఫునా హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధినేత, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది…

Thank you for reading this post, don't forget to subscribe!