republichindustan.in
Newspaper Banner
Date of Publish : 07 July 2022, 10:55 am Digital Edition : REPUBLIC HINDUSTAN

Wrngl RL: జోరుగా రేషన్‌ బియ్యం దందా

🔶 చిన్న బండితో పెద్ద వ్యాపారం
🔶 మోటార్ సైకిళ్లపై రేషన్ బియ్యం రైస్ మిల్లులకు తరలింపు
🔶 ఏమాత్రం పట్టించుకోని అధికారులు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జోరుగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. మండలంలోని ఆసరా వెళ్లి, కొండాపురం, మేడపల్లి, గుండ్ల పహాడ్, నరక పేట, రుద్రగూడెం, శనిగరం తదితర గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరించి మండల కేంద్రంలోని రైస్ మిల్లులకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అసలు పట్టించుకోకపోవటంతో ఆ దందా రోజురోజుకూ విస్తరిస్తోంది.ప్రతి నెల రేషన్‌ బియ్యం సైక్లింగ్‌ వ్యాపారం నిరంతరం జరుగుతోంది. రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు నామమాత్రం తనిఖీలు కూడా చేయటం లేదు.

కొత్త దారి ఎంచుకున్న అక్రమార్కులు
గతంలో ఆటోలు, టాటా ఏస్ వాహనాలలో రేషన్ బియ్యాన్ని తరలించేవారు. పెద్ద మొత్తంలో బియ్యం పట్టుబడితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఎవరికి అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాల పై రెండు మూడు బస్తాలు తీసుకొని డైరెక్టుగా రైస్ మిల్లులకు చేరుస్తున్నారు. మార్గ మధ్యలో ఎవరైనా అడిగితే ఇవి మా సొంత బియ్యం అని బుకాయిస్తున్నారు. ఈ తతంగం అంతా గత కొన్ని నెలలుగా జరుగుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. గురు వారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై రేషన్ బియ్యం తీసుకొచ్చి మండల కేంద్రంలోని యామిని రైస్ మిల్లులో దింప గా వాటిని అప్పటికే మిల్లులో పట్టి ఉన్న బియ్యం కుప్పలో కలిపి బస్తాలు నింపారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ నార్లపురం రాజారాం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పి.డి యాక్ట్ నమోదు చేస్తాం
ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం ఎవరైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియపరచాలనిఅన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.