republichindustan.in
Newspaper Banner
Date of Publish : 02 February 2024, 6:17 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆర్బీఐ ఆంక్షలపై స్పందించిన పేటీఎం సీఈవో

ఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం(Paytm) వినియోగదారులు ఆందోళన చెందారు.

Thank you for reading this post, don't forget to subscribe!

చివరికి కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కస్టమర్లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యాప్ కార్యకలాపాలను కొనసాగిస్తుందని వివరించారు. అన్ని వేళలా తమకు అండగా ఉంటున్నందుకు కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.

“ఆర్బీఐ ఆంక్షల తరువాత పేటీఎంకు అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చింది. ప్రతి సవాలుకు, పరిష్కారం ఉంటుంది. దేశానికి సేవ చేయడానికి మేం అంకిత భావంతో పని చేస్తున్నాం. పేమెంట్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేరికతో భారత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. PaytmKaro ఛాంపియన్‌గా నిలిచింది” అని అన్నారు.

ఇదీ జరిగింది..

ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొత్త కస్టమర్లను జత చేసుకోవద్దని, వాలెట్లలో డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ(RBI) ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల ఖాతాలు, ప్రీ-పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (NCMC) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో.. పేటీఎంపై ఆర్బీఐ ఈ ఆంక్షలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అనేది చర్చనీయాంశం అయ్యింది.

ఇందుకు కారణం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని నిబంసధనలను ఉల్లంఘించడమే. దీనికితోడు.. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, బయటి ఆడిటర్లు దీని కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదికలో భాగంగా పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని తేలింది. మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ వివరించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. దీంతో యూజర్ల సందేహాలను నివృతి చేసేందుకు సీఈవో రంగంలోకి దిగారు.