republichindustan.in
Newspaper Banner
Date of Publish : 24 February 2024, 12:44 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

1994లో హత్య.. 2024లో కేసును ఛేదించిన పోలీసులు.!

30 ఏళ్ల నాటి హత్య కేసులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి లండన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Thank you for reading this post, don't forget to subscribe!

అది కూడా ఫోరెన్సిక్‌ టెక్నాలజీలో ఆధునికత వల్లే ఈ హత్య కేసును లండన్‌ పోలీసులు విజయవంతంగా ఛేదించగలిగారు. హంతకుడు భారత సంతతికి చెందిన సందీప్‌ పటేల్‌ కాగా, బాధితురాలు మరీనా కోపెల్‌. 1994లో లండన్​లోని అపార్ట్​మెంట్​లో మరీనాను 140 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు సందీప్ పటేల్. అప్పటికి మరీనా వయసు 39, పటేల్‌ వయసు 21 ఏళ్లు. తాజాగా లండన్ కోర్టు శుక్రవారం పటేల్​కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గతేడాది జనవరిలో మరీనా కోపెల్‌ చేతి ఉంగరానికి చిక్కుకుని ఉన్న వెంట్రుక ఆధారంగా పటేల్​ను అరెస్టు చేశారు. మరీనా మసాజ్‌ నిపుణురాలు. వివాహితైన ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త లండన్‌లోనే వేరే చోట ఉంటున్నారు. పిల్లలు మరీనా తల్లితో కలిసి కొలంబియాలో ఉంటున్నారు. మరీనా నెలనెలా వారికి డబ్బు పంపేది. అయితే మరీనాకు పటేల్‌తో ఉన్న సంబంధమేమిటో ఇంకా తెలియరాలేదు.

హత్య జరిగిన రోజు మరీనాకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవటం వల్ల ఆమె భర్త 1994 ఆగస్టు 8న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ మరీనా శవమై పడి ఉండడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరీనా చేతి ఉంగరాన్ని, అక్కడే ఉన్న ఒక ప్లాస్టిక్‌ సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్లాస్టిక్‌ సంచిపై సందీప్‌ పటేల్‌ వేలిముద్రలున్నాయి. అది అతడు పనిచేసే దుకాణం నుంచి కొన్నది కావడం వల్ల పోలీసులకు అనుమానం రాలేదు. ఉంగరంతోపాటు మరికొన్ని వస్తువులను కూడా హత్యా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2022నాటికి అధునాతన ఫోరెన్సిక్‌ పద్ధతులు అందుబాటులోకి రావడం వల్ల ఉంగరానికి అంటిన వెంట్రుక సందీప్‌ పటేల్‌దేనని గుర్తించగలిగారు. దీనితో పాటు ప్లాస్టిక్‌ సంచి మీదున్న వేలిముద్రలు తోడయ్యాయి. మరీనా ఏటీఎం కార్డును పటేల్ దొంగిలించాడు. హత్య చేసిన తర్వాత ఆమె ఇంటికి కొంత దూరంలో ఉన్న ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేశాడు. ఈ సాక్ష్యాధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పటేల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.