republichindustan.in
Newspaper Banner
Date of Publish : 28 March 2024, 10:07 am Digital Edition : REPUBLIC HINDUSTAN

తెల్లారితే పెళ్లి…. అంతలోనే తేరుకొని విషాదం…

జోగిపేట : తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు 30 మంది బంధువులు ఒకే ట్రాక్టర్‌లో బయల్దేరగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. డ్రైవర్‌ మినహా మిగతావారికి గాయాలయ్యాయి. జోగిపేట ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది. గురువారం(28న) బాచారంలో పెళ్లి జరగాల్సి ఉంది. బాచారానికి చెందిన 30 మంది బంధువులు పెళ్లి కుమార్తెను తీసుకెళ్లడానికి బుధవారం ట్రాక్టర్‌లో అందోలుకు బయల్దేరారు. అందోలు మండలం మన్‌సానిపల్లి మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడింది. వాహనంలోని వారంతా కింద పడిపోయారు. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జట్టిగారి సంగమ్మ(47), రావుగారి బూదెమ్మ(50), ఆగమ్మ(50) మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Thank you for reading this post, don't forget to subscribe!