మే 5 నుంచి 28 జిల్లాలలోని ఒక్కో మండలంలో రెవెన్యూ సదస్సులు
20 వ తేదీలోపు సదస్సులు పూర్తయ్యేలా ప్రణాళిక
ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులకు మించొద్దు

రెవెన్యు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అదిలాబాద్ జిల్లా, శుక్రవారం : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ల నేతృత్వంలో ప్రతి మండలానికి రెండు బృందాలను నియమించాలని, ప్రతీ బృందంలో తహసీల్దార్, సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బృందాలు నిర్దేశిత గ్రామంలోనే ఉంటూ భూ సమస్యలపై ప్రజలు, రైతుల నుండి అర్జీలు స్వీకరించాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్నిలిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు.
కబ్జాలకు, అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూములను సైతం గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుని పక్కాగా వాటి వివరాలను రికార్డులలో పొందుపర్చాలని ఆదేశించారు.
భూభారతి నూతన చట్టంపై రాష్ట్రంలో 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు అవగాహన సదస్సులలో పాల్గొన్నారని మంత్రి వివరించారు.
ఇదిలాఉండగా, ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు గాను లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసిన వెంటనే ఏరోజుకు ఆ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు జాబితాను పంపి వారి ఆమోదం తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేశారు.అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామన్నారు. లబ్ధిదారుల చెక్ లిస్ట్ ను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు తమ అధీనంలో జాగ్రత్తగా భద్రపర్చాలని అన్నారు.
లబ్ధిదారులు ఇంటిని 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరుపుతూ, మంజూరీ తెలుపబడిన ప్రతి లబ్ధిదారుడు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరపాలన్నారు.
అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో ఇంటి నిర్మాణ పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఈ మేరకు ఏ.ఈ స్థాయి అధికారులను ప్రతి మండలానికి ఒకరు చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటి నిర్మాణ దశలను బట్టి తక్షణమే లబ్ధిదారుల ఖాతాలలోకి ఇందిరమ్మ ఇళ్ల పథకం డబ్బులను జమ చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లోజిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బు గుప్తా, ట్రైనీ కలెక్టర్ సలోని, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి
Adl SP సురేందర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments