రియాద్: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుత పరిస్థితుల పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ స్పష్టం చేశారు. సౌదీలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లతో భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వెబెక్స్ (Webex) సమావేశంలో ఆయన ఈ మేరకు భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్తో పాటు ఉప రాయబారి అబు మాథెన్ జార్జ్, కమ్యూనిటీ వెల్ఫేర్ కౌన్సిలర్ వై. సబీర్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
* పరిస్థితి అదుపులోనే ఉంది: సౌదీ అరేబియాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, భారతీయులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని రాయబారి స్పష్టం చేశారు.
* విమాన సేవలు: రాబోయే ఈద్ పండుగను పురస్కరించుకుని భారతదేశానికి వెళ్లే ప్రయాణికుల కోసం రియాద్, జెడ్డా, మదీనా నగరాల నుండి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయని తెలిపారు.
* డమ్మామ్ నుండి త్వరలో: త్వరలోనే డమ్మామ్ నగరం నుండి కూడా విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.
* భారతీయ విమాన సంస్థల సేవలు: సౌదీ అరేబియా నుండి భారతదేశానికి మన దేశీయ విమాన సంస్థల సేవలను ప్రారంభించే విషయమై అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం ఇచ్చారు.
* సేవలకు అభినందనలు: పవిత్ర రమజాన్, ముందస్తు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన రాయబారి.. సౌదీ అరేబియా వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న భారతీయ సామాజిక కార్యకర్తలు, వాలంటీర్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
తెలుగు సంఘాల ప్రాతినిధ్యం:
ఈ కీలక సమావేశంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA), తెలుగు అసోసియేషన్ సౌదీ అరేబియా (TASA) ప్రతినిధులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. తెలుగు కమ్యూనిటీ తరపున శ్రీనివాస్ మచ్చ, స్వామి, ముజమ్మిల్, నూరుద్దీన్, శార్వణి, కోకిల, శంకర్ మరియు నరేష్ తదితరులు ఈ వెబెక్స్ సమావేశానికి హాజరయ్యారు.