republichindustan.in
Newspaper Banner
Date of Publish : 24 February 2024, 12:51 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

నాతో ఖర్చు పెట్టించారు.. చంద్రబాబును నిలదీస్తా..!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది.

Thank you for reading this post, don't forget to subscribe!

118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

ఈ జాబితా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టింది. వర్గ విభేదాలు తలెత్తాయి. టీడీపీ నాయకుల్లో అసంతృప్తి చెలరేగింది. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల బొమ్మలను ముద్రించి వున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేశారు. కొన్నింటిని తగులబెట్టారు.

టికెట్ దక్కుతుందంటూ ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు బూరగడ్ద వేదవ్యాస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సొమ్మసిల్లిపోయారు. హుటాహుటిన ఆయనకు చికిత్స అందించారు. టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ముమ్మరంగా ప్రచారాన్ని కూడా చేపట్టారాయన.

జిల్లాలోని పెడన నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు వేదవ్యాస్. ఆయనకు కాకుండా కాగిత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈ పరిణామాలపై వేదవ్యాస్ స్పందించారు. తనకే టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు ఎన్నోసార్లు భరోసా ఇచ్చానని, అందుకే సొంత ఖర్చులతో పార్టీ కోసం ప్రచారం చేస్తోన్నానని అన్నారు.

చంద్రబాబు ఇలా తనను నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను కలుస్తానని, తనకు జరిగిన అన్యాయంపై నిలదీస్తానని వేదవ్యాస్ తేల్చి చెప్పారు. పెడన నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు తనకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.