republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 8:05 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆదిలాబాద్‌లో భారీ బ్లాక్‌మెయిలింగ్ దందా గుట్టురట్టు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ జిల్లా, జులై 12 : తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్లే జాతీయ రహదారి 44లో అక్రమ పశువుల రవాణా వాహనాలను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్ ముఠాను జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు మహారాష్ట్ర యావత్‌మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ నాయకత్వం వహిస్తుండగా, ఆదిలాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ రోహిత్ షిండే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు.

రోహిత్ సింధే
మహారాష్ట్ర కానిస్టేబుల్ సందీప్

నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు చేయగా, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారు: చేతన్ సింగ్ (నేరడిగొండ), జంగిలి అన్వేష్ (నేరడిగొండ), మసీద్ ఆనంద్ (ఇచ్చోడా), మహమ్మద్ మజార్ (ఆదిలాబాద్). కీలక నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

ఈ ముఠా వాహన యజమానులను, డ్రైవర్లను బెదిరించి, డబ్బు ఇవ్వకపోతే దాడులు, పోలీసు ఫిర్యాదులతో బెదిరించి నెలకు లక్షల్లో వసూళ్లు చేస్తోంది. బాధితులు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్, సిబ్బంది పాల్గొన్నారు.