republichindustan.in
Newspaper Banner
Date of Publish : 11 April 2023, 8:03 am Digital Edition : REPUBLIC HINDUSTAN

టిఎస్పీఎసి పేపర్ లీకేజీ…. ఈడీ ఎంట్రీ …

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అంచనా వేస్తోంది. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆమెతో పాటు టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీకి తీసుకొని ఈడీ విచారించనుంది.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇవాళ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. నెల రోజుల పాటు దర్యాప్తు కొనసాగించిన సిట్‌ అధికారులు.. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని పలు వివరాలు రాబట్టారు. దాదాపు 150 మందిని విచారించిన అధికారులు.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డి సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. దర్యాప్తు నివేదికలో నిందితుల పెన్‌డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించిన సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదికనూ జతపరిచారు.