అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మంది మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్ (Rajasthan)లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thank you for reading this post, don't forget to subscribe!
వివరాల్లోకి వెళ్లితే..
సిరోలికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ మహేంద్రా మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరి అంగన్వాడీలో కొలువు ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించారు. వారికి ఆశ్రయమిచ్చి అన్ని వసతులు కల్పించారు. మత్తు మందు కలిపిన ఆహారం అందించి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. అలా 20 మందిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి విషయం బయటకు చెప్పకూడదంటూ తమను బెదిరించేవారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారి నుంచి రూ.లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
వారి ఆగడాలను ఎదిరించిన ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెకు మరికొందరు మహిళలు తోడుగా నిలిచారు. అయితే, నిందితులపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయకుండా.. తాము చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని పోలీసులు కొట్టిపారేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.