republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 February 2024, 12:06 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

రూ.2000 నోట్ల విషయంలో కీలక పరిణామం.. రిజర్వు బ్యాంక్ తాజా ప్రకటన..

చాలా కాలంగా దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం జరుగుతోంది. ఈ క్రమంలో 2016లో మోదీ సర్కార్ అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Thank you for reading this post, don't forget to subscribe!

అయితే డీమానిటైజేషన్ సమయంలో లిక్విడిటీని వేగంగా పెంచేందుకు రూ.2000 నోట్లను దేశంలో ముద్రించిన సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలో దానికి ఉద్దేశించిన పని పూర్తి కావటంతో రిజర్వు బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీ పేరుతో గడచిన ఏడాది ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు పెద్ద ప్రకటన చేసింది. దీనికి ముందు చాలా కాలంగా 2000 నోట్లను ముద్రించటం నిలిపివేసి క్రమంగా వాటిని బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా సేకరించింది.

నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ అవి లీగల్ టెండర్ గా కొనసాగుతాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న వీటి విలువ గత ఏడాది ఫిబ్రవరి కాలంలోని 8.2 శాతంతో పోల్చితే 3.7 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ తీసుకున్న ఈ చర్య కారణంగా దేశంలోని బ్యాంకులు జనవరిలో అధిక డిపాజిట్లను నమోదు చేశాయి.

మే 19, 2023న సెంట్రల్ బ్యాంక్ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజున వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న 2000 నోట్ల మెుత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. దీంతో జనవరి 31 నాటికి రూ.2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.

కానీ దాదాపు రూ.8,897 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు మాత్రం ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. తొలుత రిజర్వు బ్యాంక్ ఈ నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకునేందుకు సెప్టెంబర్ 30, 2023 వరకు గడువు ఇవ్వగా.. తర్వాత దానిని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పటికీ వీలుని ప్రాంతీయ రిజర్వు బ్యాంక్ కార్యాలయం లేదా పోస్టాఫీసు ద్వారా మార్చుకునేందుకు వెసులుబాటును అందుబాటులో ఉంచింది.