అమరావతి/సౌదీ అరేబియా ప్రతినిధి: 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు, ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వర్దిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం సౌదీ అరేబియా తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం అంతా పసుపు రంగుతో అలంకరించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




ఈ మహానాడు కార్యక్రమం “మా తెలుగు తల్లి” గీతంతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం మొత్తం చిన్నారుల నృత్యాలు, ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. రాజకీయ ప్రసంగాలకు శ్రీ నాగశేఖర్ గారు, మరియు శ్రీమతి సత్య మల్లిన గారు సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ మహానాడులో ప్రధాన ఆకర్షణ చిన్నారులే! భవిష్యత్తు టీడీపీ వారసులుగా భావిస్తున్న పిల్లలు **”జై తెలుగుదేశం”** నినాదాలతో ర్యాలీగా సభకు రావడం అందరినీ అలరించింది. వారి నృత్యాలు, అనర్గళమైన ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. అనేక మంది నాయకులు తమ అనుభవాలను, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని వేదికపై పంచుకున్నారు. యువతకు కూడా ప్రసంగించే అవకాశం కల్పించడం ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జూమ్ కాల్ ద్వారా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు గారు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చరిత్రను, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్ గారు మరియు నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ మహానాడు ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజలతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాద్ గారు మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, P4 స్ఫూర్తితో తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి) ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో “హైందవ స్వర్గధామం” ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, ఇతర సేవా కార్యక్రమాలకు గాను ప్రకాశం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేత సత్కారం అందుకోవడం, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం విశేషంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా సౌదీ అరేబియా నుండి మొట్టమొదటిగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉందని తెలిపారు.
జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ నుండి 100కు పైగా టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు ఉత్సాహంగా కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జుబైల్ బృందం ప్రతి శుక్రవారం సెలవుదినంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భీమా నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కూడా వారు పంచుకున్నారు. గతంలో ప్రవాసాంధ్రులు సర్టిఫికెట్లు పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు WhatsApp గవర్నెన్స్ ద్వారా ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొంటూ శ్రీ నారా లోకేష్ గారిని ప్రశంసించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం స్థాపించబడిన పార్టీ అని, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, అండమాన్ అయినా, చివరికి అమెరికా అయినా — తెలుగు ప్రజల హృదయాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. APNRTS సేవలు, P4 కార్యక్రమం, అలాగే APNRTS ప్రవాసాంధ్ర భీమా వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, త్వరలోనే పలు ప్రణాళికలను అమలులోకి తీసుకువస్తామని తెలిపారు.
*NRI TDP, SAUDI ARABIA సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), ఖాదర్ షేక్, రవి మేడూరి, హరీష్ తదితరులు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ “మినీ మహానాడు” కార్యక్రమం ఊహించిన దానికంటే ఘన విజయాన్ని సాధించడం శుభసూచికమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వేదికపై మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం అందరినీ ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా చిన్నారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా సౌదీ అరేబియా – తూర్పు ప్రాంతం ముందడుగు వేస్తోందని అన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే నాయకులు మొదటిగా ఇక్కడి నుంచే వెలువడతారనే నమ్మకం వ్యక్తం చేశారు.