republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 10:25 am Digital Edition : REPUBLIC HINDUSTAN

GLP-1 మందులు సమాధానం చెప్పలేని ప్రశ్న

రచయిత: డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్, MD, FRCP (ప్రముఖ వైద్యుడు, పోర్ట్‌ల్యాండ్, అమెరికా)

తెలుగు అనువాదం: డి. సి. హనుమంతరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ఎస్.వి.కె.పి.పి.వి జూనియర్ కళాశాల, పెనుగొండ


ప్రపంచం నేడు GLP-1 మందుల ఆవిర్భావాన్ని వైద్యరంగంలోని ఒక పెద్ద విజయంగా భావిస్తోంది. నిజంగానే అలా అనుకోవాలి కూడా.

ఓజెంపిక్ (Ozempic), వేగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులు కోట్లాది మందికి బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, ఊబకాయంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతున్నాయి. నేటి వైద్యరంగంలో పరిశోధకులు కనుగొన్న అత్యంత ముఖ్యమైన ఔషధాలలో ఇవి ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

అయితే, ఈ మందుల అద్భుత విజయం ఒక ఆందోళనకరమైన వాస్తవాన్ని కూడా మన ముందుకు తీసుకువస్తోంది.

భారతదేశం ప్రస్తుతం టైప్-2 మధుమేహం మరియు దాని దుష్ఫలితాలకు సంబంధించిన చికిత్స కోసం ప్రతి రోగిపై సంవత్సరానికి రూ.36,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. మొత్తంగా ప్రతి సంవత్సరం దీని తాలూకు ఖర్చు సుమారు రూ.3.24 లక్షల కోట్లు చేరుతోంది.

దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త కొత్త మందుల తయారీ, ప్రభుత్వాలు మరియు ప్రైవేటు సంస్థలు పెడుతున్న అపారమైన పెట్టుబడులు కొనసాగుతున్నప్పటికీ, టైప్-2 మధుమేహం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

GLP-1 మందులు మార్చలేని ప్రశ్న

GLP-1 మందులు చక్కెర వ్యాధి చికిత్స విధానాన్ని మార్చేస్తున్నాయి. కానీ అవి అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతున్నాయి.

“ఇంతమంది ప్రజలకు అసలు టైప్-2 మధుమేహం ఎందుకు వస్తోంది?”

ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం ఇప్పుడు మరింత అత్యవసరంగా తయారైంది.

భారతదేశంలో మధుమేహం పెరుగుదల

1990లో సుమారు 85 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 2.6 కోట్ల మంది మాత్రమే మధుమేహంతో బాధపడేవారు.

నేడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగింది. అయితే చక్కెర రోగుల సంఖ్య 9 కోట్లకు పైగా చేరుకుంది.

దీనికితోడు దాదాపు 13.6 కోట్ల మంది పెద్దలు ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు.

మన జనాభా రెట్టింపు కాలేదు. కానీ చక్కెర రోగుల సంఖ్య మాత్రం మూడు రెట్లకంటే ఎక్కువ పెరిగింది.

అసలు మారింది ఏమిటి?

కేవలం రెండు లేదా మూడు తరాలలోనే మానవులు ఒక్కసారిగా ఇన్సులిన్‌ను ప్రతిఘటించే జీవులుగా మారిపోలేదు.

ఖచ్చితంగా ఇంకేదో మారింది. అది మన ఆహార వాతావరణం.

ప్రస్తుతం భారతీయుల ఆహారంలో సుమారు సగం కేలరీలు కార్బోహైడ్రేట్ల నుంచే వస్తున్నాయి.

వాటిలో ఎక్కువ భాగం శుద్ధి చేసిన ధాన్యాలు (Refined Grains) మరియు శరీరంలో చాలా వేగంగా జీర్ణమయ్యే ఆహారాల నుంచే లభిస్తోంది.

గత యాభై సంవత్సరాల్లో తక్కువ ధరకు లభించే అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలు దేశమంతటా, దాదాపు రోజులో ఏ సమయంలోనైనా సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడే రచయిత లేవనెత్తిన ప్రశ్న

ఈ ఆహారాలను సమృద్ధిగా, చవకగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల పన్ను చెల్లింపుదారుల సొమ్మును వ్యవసాయానికి సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తున్నాయి.

ఆ తరువాత, వాటి వల్ల కలుగుతున్న వ్యాధిగా భావించబడుతున్న టైప్-2 మధుమేహం చికిత్స కోసం మరో రూ.3.24 లక్షల కోట్లను ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాయి.

అయితే… మనం అసలు కారణాన్ని పట్టించుకోకుండా, దాని వల్ల వచ్చే చెడు ఫలితాలకు మాత్రమే చికిత్స చేస్తున్నామా?


ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిద్ధాంతం… ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు

గత నలభై సంవత్సరాలుగా టైప్-2 మధుమేహంపై పరిశోధనలు ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin Resistance) అనే సిద్ధాంతం చుట్టూనే తిరుగుతున్నాయి.

ఈ సిద్ధాంతం ప్రకారం శరీరంలోని కణాలు క్రమంగా ఇన్సులిన్‌కు స్పందించడం తగ్గిస్తాయి. దాంతో గ్లూకోజ్ రక్తంలోనే మిగిలిపోతుంది. చివరికి టైప్-2 మధుమేహం వస్తుంది.

ఈ సిద్ధాంతమే దశాబ్దాలుగా పరిశోధనలు, వైద్య విద్య, కొత్త మందుల అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంది.

అయితే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా శాస్త్రవేత్తలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు ప్రారంభమవుతుంది?, ఎప్పుడు ప్రారంభమవుతుంది?, గత రెండు మూడు తరాలలో అది ఎందుకు ఇంత విస్తృతంగా పెరిగింది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు.

ఇన్సులిన్ రెసిస్టెన్స్‌నే టైప్-2 మధుమేహానికి ప్రధాన కారణమని భావిస్తే, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణం ఏమిటో ఇప్పటికీ శాస్త్రం ఎందుకు వివరించలేకపోతోంది?

ఒక చాలాకాలంగా అంగీకారంలో ఉన్న సిద్ధాంతం ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతే, అది మరింత మెరుగైన ప్రశ్నలకు దారి తీస్తుంది.

రచయిత ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఆలోచన

బహుశా టైప్-2 మధుమేహం కథ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో ప్రారంభం కాకపోవచ్చు.

హైబ్రిడ్ కారు ఉదాహరణ

మీరు ఒక హైబ్రిడ్ కారును నడుపుతున్నారని అనుకోండి.

దాని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటే, కారు సహజంగానే విద్యుత్తునే ఎక్కువగా ఉపయోగిస్తుంది. పెట్రోల్‌ను తక్కువగా ఉపయోగిస్తుంది.

దీని అర్థం పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్‌ను నిరాకరిస్తోందని కాదు. అది చెడిపోయిందని కూడా కాదు.

అందుబాటులో ఉన్న మరో ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తోంది అంతే.

మన శరీరం కూడా ఇలాగే పనిచేస్తుందా?

మన శరీరంలోని కండరాల కణాలు శక్తి కోసం గ్లూకోజ్నైనా, కొవ్వు ఆమ్లాలు (Fatty Acids)నైనా ఉపయోగించగలవు.

రచయిత అభిప్రాయం ప్రకారం, టైప్-2 మధుమేహంలో కూడా ఇలాంటి మార్పు జరిగి ఉండవచ్చు.

సంవత్సరాల తరబడి అధిక పోషకాహారం తీసుకోవడం—ముఖ్యంగా వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం వల్ల—శరీరంలోని అనేక కణాలు శక్తి కోసం క్రమంగా కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

అప్పుడు అవి గ్లూకోజ్‌ను తక్కువగా వినియోగిస్తాయి.

ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.

అంటే రక్తంలో చక్కెర పెరగడం అనేది ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల కాకుండా, శరీరంలోని ఇంధన వినియోగ సమతుల్యత (Fuel Balance) మారడం వల్ల కూడా జరిగి ఉండవచ్చని రచయిత అభిప్రాయపడుతున్నారు.

Chronic Nutritional Overload సిద్ధాంతం

రచయిత ప్రకారం, టైప్-2 మధుమేహంలో మొదటి దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాకపోవచ్చు.

సంవత్సరాల పాటు కొనసాగిన అధిక పోషకాహారం (Chronic Nutritional Overload) వల్ల శరీరం ఇంధనాన్ని వినియోగించే విధానం క్రమంగా మారిపోవడమే దీనికి ప్రారంభ కారణం కావచ్చని ఆయన ప్రతిపాదిస్తున్నారు.

రచయిత అభిప్రాయం:
“ముందుగా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది?’ అని అడగడం కంటే, ‘శరీరం ఇంధనాన్ని వినియోగించే విధానాన్ని మార్చే ఆహార పరిస్థితులు ఏమిటి?’ అనే ప్రశ్న అడగడం అవసరం.”


GLP-1 మందులకు వ్యతిరేకం కాదు

ఈ వ్యాసం GLP-1 మందులకు వ్యతిరేకంగా రాసింది కాదని రచయిత స్పష్టంగా పేర్కొంటున్నారు.

వాస్తవానికి, ఈ మందులు గత అనేక దశాబ్దాల్లో వైద్యరంగంలో వచ్చిన అత్యంత గొప్ప పురోగతుల్లో ఒకటి అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇవి కోట్లాది మంది జీవితాలను మెరుగుపరుస్తున్నాయని, బరువు తగ్గడంలో మరియు రక్తంలో చక్కెర నియంత్రణలో గణనీయమైన ప్రయోజనం అందిస్తున్నాయని రచయిత అంగీకరిస్తున్నారు.

అదేవిధంగా అన్ని కార్బోహైడ్రేట్లు హానికరమని కూడా ఈ వ్యాసం చెప్పడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.


రచయిత ప్రధాన సందేశం

ముఖ్యంగా శుద్ధి చేసిన (Refined), వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని సంవత్సరాల తరబడి అధికంగా తీసుకోవడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక పోషకాహార అధికభారం (Chronic Nutritional Overload) పై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరమని రచయిత సూచిస్తున్నారు.

మన లక్ష్యం కేవలం రక్తంలో చక్కెరను తగ్గించే మరింత మెరుగైన మందులను అభివృద్ధి చేయడమే అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు నిజంగా అద్భుతమైన విజయాలే.

అయితే, కోట్లాది భారతీయులకు టైప్-2 మధుమేహం రాకముందే దానిని నివారించడం మన అసలు లక్ష్యమైతే, గత అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రధాన సిద్ధాంతాలను కూడా మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉందని రచయిత అభిప్రాయపడుతున్నారు.


ముగింపు

GLP-1 మందులు కోట్లాది మందికి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడవచ్చు.

అయితే మధుమేహాన్ని పూర్తిగా నివారించాలంటే మనం మరో ప్రశ్నకు సమాధానం కనుగొనాల్సి ఉంటుంది.

“ప్రజలు దీర్ఘకాలిక పోషకాహార అధికభారానికి గురికాకుండా ఎలా సహాయపడాలి?”

రచయిత అభిప్రాయం ప్రకారం, ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే టైప్-2 మధుమేహాన్ని నివారించే మార్గం మరింత స్పష్టమవుతుంది.


రచయిత గురించి

డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్ పోషకాహారం మరియు Metabolic Health అంశాలపై ఎనిమిది పుస్తకాలు రచించారు.

టైప్-2 మధుమేహానికి “Chronic Nutritional Overload” అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ సమీక్షిత (Peer-reviewed) శాస్త్రీయ వ్యాసాలను ప్రచురించారు.

ఆయన రచించిన కొన్ని పుస్తకాలు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి.

  • మధుమేహం – అసలైన కారణం మరియు సరియైన చికిత్స
  • చక్కెర వ్యాధిని జయించండి
  • మీ అసలైన బరువును కొనసాగించండి

పుస్తకాల కోసం సంప్రదించండి:
శ్రీమతి ఎస్. ఉదయశ్రీ
మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్
ఫోన్: 9989210113


📌 సంపాదకుల గమనిక

ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత శాస్త్రీయ అభిప్రాయాలు, పరిశోధనలు మరియు ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది.

ఇందులోని అన్ని అభిప్రాయాలు ప్రస్తుత వైద్య శాస్త్రంలో సర్వసమ్మతమైనవిగా పరిగణించబడవు.

ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి.