republichindustan.in
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:13 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మీనాక్షిపురం సాయిబాబా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

మీనాక్షిపురం (రహిమత్‌నగర్), జూన్ 8: మీనాక్షిపురం (రహిమత్‌నగర్)లోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు అశోక్ సార్ పాల్గొని బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా అశోక్ సార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల త్యాగాలు, దేశభక్తి, సేవా భావం గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అలాగే, ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుని దాని భావాన్ని ఆచరణలో పెట్టాలని తెలిపారు. గీతా బోధనలు జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం ఆలయ పూజారి ఆధ్వర్యంలో బాలబాలికలతో ప్రత్యేక హనుమాన్ పూజ నిర్వహించారు. పూజా విధానాలను పిల్లలకు వివరించి, భక్తి, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తల్లిదండ్రులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ముగింపులో ప్రసాద వితరణ నిర్వహించారు.