republichindustan.in
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 1:19 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

20 సంవత్సరాలైనా బస్టాండ్ లేదు – సాత్ నంబర్ గ్రామ ప్రజల ఆవేదన

ఇచ్చోడ , ఆదిలాబాద్ : సాత్ నంబర్ గ్రామ ప్రజలు నేటికీ బస్సు కోసం ఎండలో, వర్షంలో రహదారి పైనే నిరీక్షించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గ్రామ పరిసర ప్రాంతంలో బస్టాండ్ లేదా బస్ షెల్టర్ లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ రోజు కూడా మండుటెండలో  మహిళలు,వృద్ధులు, పిల్లలు రహదారి పక్కనే బస్సు కోసం నిరీక్షిస్తున్న దృశ్యం గ్రామ ప్రజల సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా ఎండాకాలంలో మండుటెండలు, వర్షాకాలంలో వర్షాలకు తడుస్తూ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
జాతీయ రహదారి – 44 విస్తరణ మరియు అభివృద్ధి పనులు జరిగి దాదాపు 20 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ, రహదారికి ఆనుకుని ఉన్న అనేక గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లు మరియు బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

అయితే సాత్ నంబర్ గ్రామానికి మాత్రం ఇప్పటి వరకు బస్టాండ్ ఏర్పాటు చేయకపోవడం సంబంధిత అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యపై గ్రామ ప్రజలు పలుమార్లు NHAI అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ప్రజల ప్రాథమిక అవసరాన్ని కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సాత్ నంబర్ గ్రామ ప్రజల సమస్యను గుర్తించి, ప్రయాణికుల సౌకర్యార్థం అత్యవసరంగా బస్టాండ్ లేదా బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.