republichindustan.in
Newspaper Banner
Date of Publish : 18 April 2022, 4:01 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

జిల్లాలో విస్తృతంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన కార్యక్రమాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా వ్యవస్థను నియంత్రించడానికి, ముందస్తుగానే జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ ఆర్ ప్రైమ్ బాలికల హాస్టల్ లో షీ టీం సభ్యులతో కలిసి యువతులకు సమాజంలోని మానవ అక్రమ రవాణా, కిడ్నాపింగ్, వ్యభిచారం, మహిళల అపహరణ, సైబర్ నేరాలు, బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాల పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, పూర్తి అవగాహనతో నేరాల బారిన పడకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం వల్ల ల సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉన్నందున  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రెండు షి టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని, స్త్రీపురుషులు గుమిగూడే బహిరంగ స్థలాల్లో ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి, నేరస్తుల ఆయా చర్యలు గూడచారి వేషంలో ఉండి రహస్య కెమెరాల్లో సాక్ష్యంగా బంధించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చర్యలతో జిల్లాలో వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అమ్మాయిలు ఏ సమయంలోనైనా సరే తాము ఆపదలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, ఆకతాయిలు వెంట పడినట్లు గ్రహిస్తే వెంటనే తాము ఉన్న ప్రదేశాన్ని డయల్-100 ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని ఆకతాయిల ఆట కట్టించి, వారిని అదుపులోకి తీసుకుని బాధితులకు రక్షణగా ఉంటారని తెలిపారు.

ఈ సమావేశంలో ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ లు డి రమేశ్, బాకీ , షీ టీం ఇన్ఛార్జ్ ఏఎస్ఐ సునీత రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వాణి, సిబ్బంది హనుమంతరావు, స్కూల్ ప్రిన్సిపాల్ బ్రహ్మంగారు తదితరులు పాల్గొన్నారు.